మా నాన్న మంచోడే
మా బాపు తాగోస్తే పిచ్చోడే గాని ఉత్తప్పుడు ఆయనంత మంచి మనిషి ఇంకోడు లేనేలే..
ఈ విషయం నాకు నా చిన్నప్పుడు మా బాపు కొన్ని రోజులు చెరువుగట్టు హనుమంతునికి పూజ చేసి కొబ్బరికాయా కొట్టోచ్చి, ఎర్ర బొట్టు పెట్టుకొని, పెద్ద సైకిల్ మీద అమ్మ కట్టిచ్చిన టిపిను బాక్సు పెట్టుకొని పనికేల్తుంటే అది చూసి మా అమ్మకే కాదు నాకు కూడా మస్తు సంబరమేసేది.
ఇక మా బాపుకి తాగుడలవాటు పెళ్లి గాక మునుపే సదువు మానేసిన పోరాగాల్లతో గుట్ట మీద పేకాట ఆడుకునే పోరాగాల్లతో అలవాటయ్యిందని ఎప్పుడు తిడుతుండేది మా బాపమ్మ.
మా బాపు దోస్తులంత పటేలు పటేలు అనుకుంటూ వొచ్చేటోల్లు మా ఇంటికి. “కూటికి గతిలేదు గాని పేరుకి పటేలు ఎందుకొచ్చిండ్రా పో పోండి అని తిడుతుండేది మా బాపమ్మ”.
ఇగ మా బాపు నాకెందుకు నచ్చేటోడంటే ఇక బస్తా సంచిని పరుచుకొని నేను పుస్తకాలను ముందేసుకొని సదువుతా తెగ రాస్తావుంటే, అది చూసి మా బాపు బాలమిత్ర, చందమామ, విపుల, చతుర, బాలానందం, వండరు వరల్డు, ఆంధ్ర భూమి వార పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా బోలెడన్ని, నవలలు, యద్దనపూడి సులోచన రాణి, యండమూరి, శ్రీ శ్రీ, జిడ్డు, చలం, దేవులపల్లి, వంశీ, కదిరు, కాకుండా అనువాదాలు అప్పుడప్పుడు మత గ్రంధాలు, మంచి వ్యాసాల పుస్తకాలు, అంతేనా బాపు, అక్బరు, శ్రీధరు కార్టునులని కత్తిరించుకోవడం, జీవిత చరిత్రలు ఇలా ఏది బడితే అది అన్ని రెండుకట్టెల సంచిలో మొదట్లో అవన్నీ ఏడినుండి తెచ్చేటోడో తెలియకుండా అడక్కుండా అన్నిటిని ఊది పడేసేటోన్ని ఆ తర్వాత తెలిసింది అవన్నీ చిత్తుకాగితాల వాళ్ళు పాత పేపర్ వాళ్ళు కొనుక్కేల్లి అమ్మి పడేసే ఐరన్ గారేజులో నుండి కిలలకోద్ది చొప్పున వాల్లధగ్గరినుండి ఐదారుపయలక్కిల చొప్పున తీసుకొచ్చి కుప్పలుగా పోసేటోడు.
ఏంటో ఇక తెచ్చిన పుస్తకాలలో రెండు రోజులు తీరి పార బొమ్మల్ని చుసిన తర్వాత అప్పుడు నెమ్మదిగా రోజుకు నాలుగు, వీలైతే ఐదు ఆరు గంటల చొప్పున ఎండకాలమైతే ఇక తిండి తిప్పలు లేకుండా మేమేమి తక్కువ కాదన్నట్టు మా అక్క మా అన్న కూడా మూకుమ్మడిగా కిక్కురుమనకుండా రెండు గదుల కొంపలో ఇంటెనక కాలి జాగాలో, వీలైతే వంటకేల్లె గుట్టమిధ నరసింహ స్వామి గుళ్ళో, బాధ్రకాలి చెరువుగట్టో పెట్రోల్ బంకు కాడి పబ్లిక్ గార్డెన్ లోనో జూ పార్కులోనో, ముజికల్ గార్డెన్ లోనో, వేయిస్థంబాల గుళ్ళో ఇలా ఎక్కడ బడితే అక్కడ ఎప్పుడు బడితే అప్పుడు ఒకటే సదువుడు.అందుకేనేమో మా గల్లిలల్ల ఉండే పిలయకలకు నేను దోస్తుని కాలేక పోయా. కొద్ది రోజులు తర్వాత మా అన్నయ అప్పుడప్పుడు రాసేటోడు ఏది బడితే అది, అది చూసి అక్కయ కూడా బాగానే రాసింది కథలు కవిత్వాలు ఏంటో రాను తగ్గించి పూర్తిగా మానేసింది. ఇంట్లో ఆకరోన్ని పైగా పుస్తకాల పిచ్చోని మనం రాయకోపోతే ఎట్టా. ఇగ రాసుడే రాసుడు ఎవరికీ యే వ్యాసం కావాలన్నా, ప్రేమ లేకలు రాయాలన్న, ఉపన్యాసాలు ఇవ్వాలన్న, జోకుల డ్రామాలు వేయాలన్న, వచ్చి రాక నేను రాసే పిచ్చి గీతలే మా దోస్తులకి దిక్కు.
అప్పట్లో కథలు రాసుకునే రచయత చేతిలో ఉండే పెద్ద జిప్పు సంచి లాంటి సంచే నా బుజాన కూడా ఎప్పుడు వేలాడుతుండేది. నేను చదివే చదువుడు చూసి మా అమ్మ, మా బాపు, మా బాబాయి, మా మామయ్యా, ఆకరికి మా కిలాసు పిలకాయలంత ముక్కున ఎలేసుకొనేటోల్లు.
నేను చదివిన పుస్తకాలో లేక నాకు పరిచమైన బిన్న స్వభావపు వ్యక్తుల ప్రభావమో ఏమో గాని సాధారణ సబ్య సమాజానికి వేలివేసినట్టు, ఇది కుదరని పని, వీడు వీడి ఆలోచనలు, గాల్లో మేడలు కట్టకు, ముందు నీ సదువు సదివి మంచి ఉద్యోగం సంపాదించు, ఇలా ఆవహేళనకు, అవమానాలకు, దగ్గరిగా ఉండేవి నా ఆలోచనలు, నా ఆచరణలు, అయినా స్వతంత్ర భావాలు సొంత నిర్ణయాలు, దేనికి భయపడకపోయే తత్వం, నా మీద నాకు గట్టి నమ్మకం, ప్రపంచమేమి ఒకరి సొంతం కాదు అనుకోవడం, మనుషుల్ని చూడగానే వారి స్వభావాన్ని వారిని యిట్టె పసిగట్టడం, నా జీవితం నాదే నాకు నచ్చినట్టు బతకొచ్చనే ధీమా అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడలేని ఎన్నడు లేని మార్పంత నాలో కలిగింది ఆ పుస్తకాల దెబ్బతో. ఇక రాను రాను ఆ పుస్తకాలని పెట్టుకొనే చోటు మా కొంపలో లేక మా కాపువాడ రావి చెట్టు దాగ్గరుండే చిన్న గ్రంధాలయంలో ఇంకా కొన్ని పబ్లిక్ గార్డెన్ గ్రంధాలయంలో, మిగిలినవి జుబైర్ బుక్ స్టాల్ కి అనుకోని ఉన్న మాసిదు పక్కనుండే గ్రంధాలయంలో భధ్రపరిచనం నేను మా ఆరిఫ్ గాడు.
అప్పట్లో నా పుస్తకాల పిచ్చిని, నేను తెచ్చుకునే మార్కులని చూసి మా ప్రిన్సిపాల్ మేడం ఆరో తరగతిలో టీచర్లందరిని పిలిచి భలే మెచ్చుకుంటూ అభినంధించేది,
ఇక అప్పటి సంధి, మా శ్రీ వాణి నికేతాన్ చిన్న స్కూల్లో పిలకాయలందరికీ నేనే పెద్ద దిక్కునయినా. ఇస్కుల్లో ఎం జరిగిన జరగపోయిన అన్ని పనులకు పెద్ద దిక్కునై నడిపించేటోన్ని. నాకు తోడుగా రవి గాడు ఆరిఫ్ గాడు.
ఏడో తరగతి వరకు మాత్రమే ఉన్న మా స్కూల్ ని ఎనమిది, తొమ్మిది, పది, వరకు తీసుకోచ్చినం. అంటే ఆ స్కూల్లో టెంతు ఫస్టు బ్యాచు మేమే చిత్రమేమిటంటే అన్ని స్కూల్లో ఒక్కో తరగతిలో నలబై యాబై పిలకాయలుంటే మా పదో తరగతి బ్యాచులో నేను, రవి గాడు, ఆరిఫు గాడు, నఫీజా సుల్తాన మేము నలుగురం.
ఇంకో బాధాకరమైన విషయమేమిటంటే పదో తరగతిలో నేను ఫస్టు క్లాసులో పాసైతే తక్కిన ముగ్గురు ఫెయిలవడం. అయితేనేమి ఎందుకు కొరగాకుండా పోతరేమోనని అప్పట్లో బయపడ్డ వాళ్ళంతా తర్వాత తర్వాత ఆరిఫు, రవి గాడి ని చూసి మెచ్చుకుంటుంటే నాకు సంతోషంతో మనిషికి కావాల్సింది చదువు కాదు బ్రతుకుతెరువు నేర్చుకోవాలి దేహి అని ఒకరిపై ఆధారపడి బ్రతకడం కాకా సొంతకాళ్ళపై ధైర్యంగా నిలబడగలిగే సత్తువ ముఖ్యం అని వారిని చూసి నేర్చుకున్నాను. ఇక పదో తరగతి తర్వాత నఫీజా సుల్తాన ఇప్పటికైనా కనిపిస్తే ఒట్టు (పాపం మంచి పిల్ల ఇప్పుదేక్కడుందో).
ఇక గమ్మున కూర్చునే రకాన్ని నేను కాకపోవడం, కొద్దో గొప్పో వాడలో నాకున్న మంచి పేరు, నేను గీసిన బొమ్మలు కథల పుస్తకాల్లో కనిపించడం, విశ్వం సౌండ్ సెంటర్ లో పార్ట్ టైం జాబు చేస్తున్నపుడు పరిచయమైనా ఆకాశవాణి చంద్రమోహన్ గారి పుణ్యమా అని రేడియోలో నా గొంతు వినపడడం, జానపద గాయకులతో కలిసి పనిచేయడం, ఇక మా సైకాలజీ డాక్టర్ నారాయణ అంకులుతో కలిసి జైల్లో కైదిలను, పిచ్చాసుపత్రిలో పిచ్చోల్లని, ఆనాద ఆశ్రమం లో పిల్లలని, వృద్ధాశ్రమం లో పెద్దోల్లని, వారి మనస్తత్వాలని గమనిస్తూ వారిలో మనో ధైర్యాన్ని కల్పించే కౌన్సిలింగు ఇచ్చే విధానాన్ని పసిగట్టడం అది వీలు చిక్కినప్పుడల్లా మా వీధిలో ఉన్న పిల్లకాయల భవిష్యత్తు పై చదువు పై ఉన్న భయాలను పోగొట్టే కౌన్సిలింగునిస్తూ, బొమ్మలు గీయడం నేర్పిస్తూ, ఊరంతా తిప్పుతూ, టూషన్లు చెప్తా ఉంటె నాకు మా గల్లిలనే కాదు ఊరంతా దోస్తులే. ఇక హైదరాబాద్ కి వచ్చిన ఈ ఆరేళ్లలో ఈ దోస్తుల లిస్టు మరి పెరిగిపోయింది. ఈ ఆరేళ్లలో హన్మకొండ లో మార్పులెన్ని జరిగిన అప్పుడప్పుడు నేను పని చేసిన విశ్వం సౌండ్ సెంటర్ కి వెళ్తే ఆప్యాయంగా పలకిరించే సూర్యం సేటు, ఆ సౌండ్ సెంటర్ కి అనుకోని ఉండే జుబేర్ బుక్ స్టాల్ ఓనర్ జుబేర్ భై హత్తుకొని వాటేసుకోవడం(ఆలోచిస్తుంటే విశ్వం సౌండ్ సెంటర్, జుబేర్ బుక్ స్టాల్ ఓనర్ కి ముందు ముందు రెండు కథలని అంకితం చేయక తప్పదు. నేను వారితో గడిపిన రోజులు అలాంటివి). నేక్కర్లేసుకొని నా చుట్టూ రఘు అన్న అంటూ తిరిగిన పిల్లలంతా గుర్తు పట్టి ఆగి మరి గౌరవిస్తుంటే నాకు భలే సంతోషమేస్తుంటుంది.
అప్పుడప్పుడు మా మాడెం చెప్తుండేది మీరు పెద్ధవల్లయ్యమని గర్వపడుతున్న మా కళ్ళకి నిక్కర్లేసుకొని చిముడు తుడుచుకుంటు బుల్లి బుల్లి అడుగులేసుకుంటూ వొచ్చే చిన్న పిల్లలే. నిజమే అందుకే ఇప్పటికి పిల్లాడినై ప్రతి పంద్ర ఆగష్టుకి, ప్రతి గణతంత్ర దినోత్సవానికి, జానువరి ఫస్టు కి తప్పకుండ నాకు చదువుని ప్రసాదించిన మా ప్రిన్సిపాల్ వాణి మాడం గారిని కలిసి ఓ మంచి పుస్తకాన్ని బహుమతి ఇవ్వడం అలవాటుగా ఏర్పరుచుకున్నాను. ఏంటో న్యూ ఇయర్ కి మిస్ అయ్యాను. గణతంత్రం వొస్తుంది. మొన్న విశాలాంధ్రలో తన కోసం తీసుకున్న కొన్ని పుస్తకాలని పట్టుకొని వెళ్లి కలవాలి మా మేడంని తనతో పాటే,
ఆ స్కూల్ గేటు తలుపుల్ని తాకి నా జ్ఞాపకాల తలపులని తెరచుకొని రావాలి,
కూర్చోడానికి సరిగా అందని బెంచీలు ఇప్పుడు చూడడానికి పొట్టిగా కనిపించే బెంచిలకు మధ్యన దాగిన స్వచ్చమైన మల్లె పూల జ్ఞాపకాల తీగను మళ్లీ అల్లుకొని రావాలి. మా స్కూల్ కి మరో ఆరు రోజుల దూరం లో నేను.
ఏంటో ఆలోచిస్తుంటే నాకు బ్రతుకుని ఎలా బ్రతకాలో నేర్చుకోవడానికి నాకోసం బీదరికాన్ని సృష్టించి పెట్టినందుకు,
ఆ బిధరింకంలో అనుక్షణం ఆనందాన్ని వేత్తుక్కునే అవకాశం కల్పించినందుకు,
నేను నీల మారకుండా నువ్వు నాకు ఆదర్శంగా నిలిచినందుకు,
పై చదువులు చదవించలేక పోయిన నాకోసం విలువైన జ్ఞానాన్ని కుప్పలుగా పోసినందుకు, వాటి ద్వారా నను మనిషిల మార్చినందుకు,
ప్రతి రోజు నా ఆలోచనలన్నీ ఆచరణలోకి పెట్టె ప్రయత్నం చేస్తూ అప్పుడప్పుడు నన్ను అవహేళన చేసిన వారిని ముక్కున వేలేసుకునేలా చేయగలుగుతున్నందుకు,
తెలిసో తెలియకో దానికి కారణం మా తాగుబోతు నన్నే అనే గర్వంగా చెప్పుకోవాలని ఉంది.
అందుకే బాపు ఐ లవ్ యు.